ఏపి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లను సుప్రీం కోర్టు కొట్టేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ల పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషి కేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉద్యోగ సంఘాల పిటిషన్ పైనా ధర్మాసనం తప్పుబట్టింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా, ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం అంటూ జస్టిస్ కౌల్ అన్నారు. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు, ఇప్పుడు ఈసీకి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని సుప్రీం ధర్మాసనం ఆక్షేపణ వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో ప్రతిష్టంభనకు తెరపడింది.