అమరావతి రాజధాని కేసులో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఏపి హైకోర్టులో గతంలో ఇచ్చిన పలు ఆదేశాలపై స్టే ఇచ్చింది. నిర్దీత కాల పరిమితిలో రాజధానిలో అభివృద్ధి పనులు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలకు మాత్రం స్టే ఇచ్చింది. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదువరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
నెల రోజుల లోపు కొన్ని పనులు, ఆరు నెలల్లో మరి కొన్ని పనులు చేయాలన్న గతంలో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అమరావతి రైతులు ఏపి హైకోర్టులో కోర్టు దిక్కర పిటిషన్లు వేశారు. ఈ తరుణంలో కాలపరిమితికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం ధర్మాసనం స్టే విధించడంతో ఏపి సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయ్యింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఏపి ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, రైతుల తరపున సీనియర్ కౌన్సిల్ లు శ్యామ్ దివాన్, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు విచారణ జరగ్గా ఇరుపక్షాలకు పలు అంశాలపై సూటి ప్రశ్నలను సంధించింది. కేంద్రం ఆమోదించిన విభజన చట్టాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ధర్మాసనం ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఆరు నెలలోనే రాజధానిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టింది.