ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. అమరావతి రాజధాని కేసు త్వరిగతిన విచారణ జరపాలని ఏపి సర్కార్ మరో మారు కోరినా ధర్మాసనం తిరస్కరించింది. ఇంతకు ముందు ప్రకటించిన తేదీనే ( ఈ నెల 28వ తేదీ) విచారణ జరుపుతామని స్పష్టం చేసింది జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం. అమరావతి కేసు విషయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది గురువారం నాడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతకు ముందు ప్రకటించిన 28వ తేదీ కాకుండా విచారణ త్వరితగతిన జరపాలని కోరారు.
అమరావతి రాజధాని కేసు పరిధి చాలా పెద్దదనీ, విచారణ చేపడితే సార్ధకత ఉండాలని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతకు మించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీ మంగళవారం అయినందున ఒక్క రోజులో విచారణ సాధ్యం కాదనీ, 29, 30 తేదీలలో కూడా విచారించాలని ఏపి ప్రభుత్వ న్యాయవాదులు విన్నవించారు. బుధ, గురువారాల్లో నోటీసులిచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరగా, సీజేఐ సర్క్యులర్ విషయం తెలియజేసి తోసిపుచ్చింది.
అమరావతి కేసు విచారణ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారం ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచిన సంగతి తెలిసిందే. జస్టిస్ కేఎం జోసెఫ్ , జస్టిస్ బీవి నాగరత్న తో కూడిన ధర్మాసనం .. మార్చి 28న విచారణ చేపడతామని తెలిపింది. అయితే మూడు రోజులైనా గడవక ముందే మరో సారి ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్టులో విచారణ సమయంలో వాయిదాల వాయిదాలు అడిగి మూడేళ్ల పాటు ప్రభుత్వం సాగదీసిందనీ, హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా ఆరు నెలల పాటు ఎస్ఎల్పీ ఫైల్ చేయకుండా తాత్సారం చేసి ఇప్పుడు త్వరితగతిన విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో విజ్ఞప్తుల విజ్ఞప్తులు చేస్తుండటం ఏమిటని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సుప్రీం కోర్టులో రాజధాని అంశం పై తీర్పు వచ్చేస్తే అంత త్వరగా మరో సారి అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టేసి వెంటనే విశాఖను రాజధాని చేయవచ్చని జగన్ సర్కార్ భావిస్తున్నది. అందుకే ఢిల్లీ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విశాఖ రాజధాని అవుతోందనీ, త్వరలో తాను విశాఖకు షిప్ట్ అయి అక్కడి నుండే పరిపాలన సాగిస్తానని తెలియజేశారు.
ఈసీ నియామకాలపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?