సుప్రీం కోర్టులో నేడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరగనున్నది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న వేళ దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ రావడంతో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు ఈ పిటిషన్ విచారణ సందర్భంలో దర్యాప్తులో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. కేసు పురోగతిపై సీల్డ్ కవర్ లో స్టేటస్ రిపోర్టు కోర్టుకు అందించాలని ఆదేశించింది.
ప్రస్తుతం రాంసింగ్ అనే సీబీఐ అధికారి వివేకా కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ అందించే స్టేటస్ రిపోర్టు పరిశీలించిన అనంతరం సుప్రీం కోర్టు..దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశిస్తుందా లేక పిటిషనర్ వాదనలకు ఏకీభవించి దర్యాప్తు అధికారి మార్పునకు ఆదేశిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మూడు పర్యయాలు విచారణ ఎదుర్కొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబడుతూ ఆరోపణలు చేసి ఉన్నారు.