Breaking: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరూ చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరుపున సిద్ధార్ధ లూత్ర వాదనలు వినిపించగా, అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
పిటిషన్ పై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారి తీసేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని సీజేఐ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేశారు. దీంతో అవినాష్ అరెస్టునకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదే సందర్భంలో దర్యాప్తు గడువును కూడా రెండు నెలలు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు గడువు ఏప్రిల్ 30 నుండి జూన్ 30వ తేదీ వరకూ పొడిగించి ధర్మాసనం.
మరో పక్క ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని అవినాష్ తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంగళవారం (రేపు) హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకూ అరెస్టు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి అదేశాలు ఇవ్వలేమని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్దంగా ఉంటాయని అన్నారు.