Supreme Court: ఏపి సీఐడీ ఇటీవల వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజుపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో రఘురామకృష్ణంరాజుతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానల్స్ పైనా రాజద్రోహం అభియోగాలను ఏపి సీఐడీ మోపింది. దీనిపై ఈ ఛానళ్లు సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లపై నేడు విచారణ జరిపింది. రిట్, కోర్టు దిక్కరణ పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కరోనా వార్తలు ప్రసారం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపున న్యాయవాదులు వివరించారు. ఈ తీర్పునకు విరుద్ధంగా కేసు నమోదు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న కరోనాతో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేస్తున్న దృశ్యాలు ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైయ్యాయి. మరి ఆ ఛానల్ పై దేశ ద్రోహం కేసు పెట్టారా అని వ్యాఖ్యానించింది. ప్రతి విషయాన్ని రాజద్రోహంగా పరిగణించడం సబబు కాదని సుప్రీం కోర్టు పేర్కొన్నది. దీనికి ప్రత్యేక మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్చ, హక్కులపై ఐపీసీ 124ఏ, 153 మార్గదర్శకాలపై పునశ్చరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read More: Telangana Politics: కేసీఆర్ ని గద్దె దించుతాం.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!!
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వం, సీఐడీలకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. ప్రతివాదుల కౌంటర్లపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని పిటిషనర్ లను ఆదేశించింది. సీఐడి పెట్టిన కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ పూర్తి అయ్యే వరకూ ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలా వద్దా అన్నది అప్పుడు విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.