Supreme court: ఉత్తరప్రదేశ్లోని అయిదు నగరాల్లో లాక్ డౌన్ విధించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో యూపిలోని లఖ్నవూ, ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్ఫూర్, గోరఖ్పూర్ లలో ఏప్రిల్ 26వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో వివాహాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేదం విధించింది. ముందుగా నిర్ణయించుకున్న వివాహాలను కేవలం 25 మందితో నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే ఈ తీర్పును ముఖ్యమంత్రి యోగి అతిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
యోగి ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. లాక్ డౌన్ విధించే అంశం న్యాయ వ్యవస్థ పరిధిలోనిది కాదని యూపి ప్రభుత్వ తరపు న్యాయవాది తుషార్ మోహతా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 28వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రభుత్వం వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.