YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో ఇవేళ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుబట్టిన ఆ ఉత్తర్వులపై స్టే విధంచింది. ఈ పరిణామం ఒక విధంగా అవినాష్ రెడ్డికి షాక్ యే. అయితే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ సోమవారం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంత అవినాష్ రెడ్డికి ఊరట లభించింది.
వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్చగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగింది. ఈ పిటిషన్లో సునీత ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 డిసెంబర్ 19న సీఎం జగన్ ఏపి అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తూ మాట్లాడారని సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితుడికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావునిస్తొందని అన్నారు. అవినాష్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతనే జగన్ యాక్టివ్ అయ్యారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి చార్జిషీట్ లో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు కొనసాగనీయకుండా అన్ని ప్రయతానలు మొదలు పెట్టారని పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా హైకోర్టు తీర్పుపై సీబీఐ ఎందుకు సుప్రీం కోర్టుకు రాలేదని ధర్మాసనం ప్రశ్నించగా, హైకోర్టులో 25వ తేదీ తీర్పు వెల్లడిస్తామని చెప్పినందున రాలేదని సీబీఐ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి స్థాయి వాదనలు సోమవారం వింటామని తెలిపింది. తెలంగాణ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొనగా, సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఆ నేతలు, ప్రముఖులకు ‘ట్విట్టర్’ షాక్ ..జగన్, చంద్రబాబు అకౌంట్ల సహా వీరందరి బ్లూటిక్ తొలగింపు