ఏపీలో ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రకటనలు, కామెంట్ల కంటే ఆక్తిగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు దృష్టి సారించారు అనేది మీడియాలో ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
దీనికి కారణం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు జరుగుతున్న పరిణామాలు. ఇదే మసంయలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో సహకరించలేమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే, దీని తర్వాతే అసలు ట్విస్టు జరిగింది.
నిమ్మగడ్డ రూటు మారిందా?
ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వివిధ జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొనలేదు. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఫెడరేషన్ తమ వైఖరిని వెల్లడించారు. అయితే, తమపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో , తన ప్రాణాలకు ముప్పు కలిగినపుడు ఎదుటివారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనను ఉద్దేశించి వెంట్రామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, ఇది దురదృష్టకరం అని ఎస్ఈసి కమిషనర్ పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని డీజీపీకి రాసిన లేఖలో ఎస్ఈసి కమిషనర్ పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని ఎస్ఈసి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ డీజీపీని కోరారు.
నిమ్మగడ్డ టార్గెట్ మార్చడంతో ఏం జరగనుంది?
ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కు అనేక జిల్లాలకు చెందిన అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంతో… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎవరు ఆటంకం కలిగించినా దానిపై గవర్నర్ కు నివేదిక అందిస్తామని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ తన ఫోకస్ మార్చి సీఎం జగన్ బదులుగా ఉద్యోగ సంఘాల నేతను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఏం జరగనుందనే టాక్ మొదలైంది.