YS Sharmila : తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్ షర్మిల ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో దివంగత సీఎం వైఎస్ అభిమానులతో సమావేశం ఒకటి. తాజాగా లోటస్ పాండ్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్ వన్గా ఉందని.. పసుపు బోర్డ్ తెస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మరీ రైతులను మోసం చేశారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. దీనికి అరవింద్ కౌంటర్ సైతం ఇచ్చారు. అయితే, ఈ ఎపిసోడ్ పాత రాజకీయ ఎత్తుగడలు కారణమని పలువురు అంటున్నారు.
YS Sharmila : అరవింద్ ఏమంటున్నారంటే…
పసుపు బోర్డు విషయంలో తనపై కామెంట్ చేసిన వైఎస్ షర్మిలకు భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోడలు, బ్రదర్ అనిల్ భార్య సిస్టర్ షర్మిల నన్ను ఎక్కడో గుర్తు చేసుకున్నారాట.. సంతోషం.. కానీ, విషయాలు మాట్లాడే ముందే.. అవగాహన చేసుకుంటే మంచిదని సూచించారు.. మీరు వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు అనే విషయాన్ని మర్చిపోవద్దన్న ఆయన… మీ తండ్రి భాగస్వామిగా ఉన్న యూపీఏ, యూపీఏ2 సర్కార్ హయాంలో ఉన్న పరిస్థితి మార్చి.. ఇప్పుడు పసుపునకు అత్యధిక ధర కల్పించామన్నారు. మీ అన్న సీఎంగా ఉన్న ఏపీలో ప్రకటించిన బోనస్ ధరకంటే.. ఇక్కడ అత్యధిక ధర ఇస్తున్నామన్నారు.
పాత `పగ`లే కారణమా…
ఎంపీ ధర్మపురి అరవింద్ , వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధంలో వారి తండ్రుల రాజకీయ ఎత్తుగడల నాటి సమీకరణాలే కారణమా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పీఠం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి.శ్రీనివాస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ సమయంలో రాజకీయ సమీకరణాలు, గాడ్ ఫాదర్ వంటి ఈక్వేషన్లు తెరమీదకు వచ్చి డీఎస్ చాన్స్ మిస్సయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల రాజకీయ వారసుల మధ్య మళ్లీ పొలిటికల్ వార్ జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.