ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. డబ్బులకు అమ్ముడుపోయి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ విమర్శిస్తుండగా, తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదనీ, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించి అధికార పార్టీ పై నలుగురిని సస్పెండ్ చేసింది. దీంతో నిత్యం వీళ్లు వార్తల్లో నిలుస్తున్నారు. అధికార వైసీపీ నేతలు వీళ్లను అమ్ముడుపోయిన నేతలు విమర్శిస్తుండగా, వాళ్లు వైసీపీపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో బహిష్కృత ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

వాళ్లకు నచ్చిన వాళ్లకు సీటు ఇవ్వాలని, నా సీటును అమ్మేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు మేకపాటి. ఆరోగ్యం బాగోలేదు, ఈ ఒక్క సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహనరెడ్డిని పలు మార్లు కోరినా, అవకాశం లేదు. కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ చెప్పారన్నారు. మెట్టుకూరు ధనుంజయరెడ్డికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయి తనను పక్కన పెట్టారని అన్నారు. నీ గ్రాఫ్ సరిగా లేదు శేఖర్ అన్నా అని జగన్ తనతో అన్నట్లుగా చెప్పారు మేకపాటి. ఐ ప్యాక్ సర్వే వాళ్లు గానీ, ఇంటెలిజెన్స్ వాళ్లు గానీ తన పట్లే నియోజకవర్గంలో అనుకూలంగా ఉందని చెప్పారనీ, కానీ వాళ్ల (అధిస్టానం)కు నచ్చినోళ్లు, మెచ్చినోళ్లకు టికెట్ ఇవ్వాలని ముందుగానే డిసైడ్ అయ్యారని తెలిపారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తున్నారు, మీ (ఎమ్మెల్యేల) మొహం చూసి కాదు అనేది సీఎం జగన్మోహనరెడ్డి అభిప్రాయంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కుమారుడుగా జగన్ ను చూసి ఓట్లు వేసి ఉన్నారు కానీ ఈ దఫా (2024లో) ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు మేకపాటి. ఎవరిని చూసి ఓట్లు పడతాయో, ఎవరికి ఓట్లు వేస్తారో తెలుస్తుందన్నారు.
తనకు పది కోట్లు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు మేకపాటి. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో తనకు రెండు దశాబ్దాలుగా మంచి పరిచయం ఉంది కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆయన ద్వారా డబ్బులు తీసుకున్నారు అంటూ చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని, అవసరమైతే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్దమని అన్నారు మేకపాటి. మేకపాటి కుటుంబం పార్టీకే అండగా ఉంది తప్ప ఇంత వరకూ పార్టీ నుండి ఏ ఎన్నికల్లోనూ డబ్బు తీసుకోలేదని, తమ డబ్బే ఖర్చు పెట్టుకున్నామని చెప్పారు. బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ కొనుగోలు చేశాను అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మేకపాటి ఖండిస్తూ, అక్కడ తన పేరుతో ఉంటే తీసుకోవచ్చని అన్నారు. గౌతమ్ రెడ్డి మరణానంతరం తనకు మంత్రి పదవి ఇవ్వమని సీఎం జగన్ ను కోరినట్లుగా చెప్పారు మేకపాటి. జిల్లాలో నాలుగు సార్లు గెలిచిన తనకు కాకుండా రెండు సార్లు గెలిచిన వ్యక్తిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడానికి అడ్డుకున్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు.
అవసరం అయితే తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని మేకపాటి తెలిపారు. ఆరోగ్యం సహకరించకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. మనసు క్షోభ కల్గించే విధంగా వైసీపీలో తన పట్ల వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పక్కన బెట్టడానికి కారణం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని ఆరోపించారు. తాను భవిష్యత్తులో బీజేపీలోకి వెళితానో, లేక టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలో ఏ పార్టీకి వెళతానో ఇప్పుడే చెప్పలేనని అన్నారు మేకపాటి. తనపై ధనుంజయరెడ్డి చిట్టా తయారు చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన .. చివరి నిమిషంలో మరో కీలక మంత్రితో భేటీ