AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో ఆలయాలలోని అర్చకులు, మజీదులో ఇమాం మౌజర్లకు , చర్చి పాస్టర్ లకు గౌరవ వేతనాలను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెంచిన వేతనాలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేశారు. దశాబ్దాల తరబడి ఆలయాల్లో అర్చకుల వేతనాల గురించి పాలకులు పట్టించుకోలేదు. ఈ తరుణంలో సీఎం జగన్ వేతనాలను పెంచడంతో పాటు బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేశారు. దీంతో ఆయా వర్గాల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సందర్భంలో ఆలయాల అర్చకుల వేతనాలను పెంచడంతో పాటు పెంచిన వేతనాలను చెల్లించేందుకు వీలుగా బడ్జెట్ లో కేటాయింపులు జరపడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిషికేశ్ పర్యటనలో ఉన్న స్వామిజీ .. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అభినందిస్తూ నేడు ప్రకటన విడుదల చేశారు.
దశాబ్దాలుగా అర్చకుల వేతనాల కోసం పాలకులు ఎవరూ పట్టించు కోలేదన్నారు. మ్యానిఫెస్టోలో ఉంచినా అర్చకుల వేతనాలను పెంచాలన్న ఆలోచనను నిర్లక్ష్యం చేశారని అన్నారు. జీతాలను పెంచడమే కాకుండా అందుకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం సంతోషించ దగిన విషయమని స్వామిజీ అన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి అభినందనీయుడని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ప్రభుత్వ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రిషికేష్ లో ఉన్న తాము ఈ వార్త విని ఎంతో ఆనందించామన్నారు. సీఎం వైఎస్ జగన్ కు రాజశ్యామల ఆమ్మ వారి అశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని స్వరూపానందేంద్ర స్వామీజీ పేర్కొన్నారు. ఏపి ప్రభుత్వం అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ లో రూ.120 కోట్లు కేటాయించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?