గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ లో మరో సారి వర్గ విభేదాలు బహిర్గతమైయ్యాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉండగా ఇంతకు ముందు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నాటి జిల్లా పార్టీ సమన్వయకర్త, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి వెళ్లి మళీ తన వర్గీయులతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో రీసెంట్ గా డొక్క మాణిక్యవరప్రసాద్ స్థానంలో అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ ను పార్టీ నియమించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం తాడికొండలో సచివాలయ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, బత్తిన బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు అదనపు సమన్వయకర్త కత్తెర సురేష్ హజరైయ్యారు. అయితే కత్తెర సురేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం ఆందోళన చేసింది. సమావేశంలో డొక్కా వర్గానికి ప్రాధాన్యత లభించడం లేదని పేర్కొన్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.
సురేష్ కు వ్యతిరేకంగా డొక్కా కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ పరిణామం పట్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఇది పార్టీ సమావేశం కాదనీ, సచివాలయ సమన్వయకర్తల సమావేశమని చెప్పారు. పిలవని సమావేశానికి వచ్చి ఇలా ఆందోళన చేయడం, తమను ఘోరావ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. అనంతరం సమావేశాన్ని ముగించి నేతలు వెళ్లిపోయారు.
ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని నరేంద్ర మోడీ