Suicide: ఏపిలోని ఒక తహశీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం ఆ జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో విషాదాన్ని నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలాన్ని రేపింది. శ్రీనివాసరావు ఇటీవలే పెదబయలు తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉంటున్నట్లు సమాచారం. తహశీల్దార్ కార్యాలయంపై ఉన్న నివాస గృహంలో శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం యధావిధిగా ఆఫీసుకు వచ్చిన అటెండర్ తహశీల్దార్ నివాసానికి వెళ్లగా ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని చూసినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించి కార్యాలయ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో అక్కడ విషాదఛ్చాయలు అలుముకున్నాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తహశీల్దార్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాసరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి ఆయన వెళ్లారు. ఆ సమయంలో భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారనీ, దాంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఘటన ప్రదేశంలో సూసైడ్ నోట్ ఏమైనా ఉందా, ఆయన ఆత్మహత్య కు గల కారణాలు ఏమిటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన జిల్లా రెవెన్యూ వర్గాలను దిగ్బాంతికి గురి చేసింది.