ఏపి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెన్నై (తమిళనాడు)కు చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ ( జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్) భారీ విరాళాన్ని అందించింది. కంపెనీ ప్రతినిధులు మంగళవారం సీఎం వైఎస్ జగన్ ను కలిసి కోటి అయిదు లక్షల డీడీని అందజేశారు. ఏపిలో కోవిడ్ -19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమకు ఎంతగానో ప్రభావితం చేశాయని కంపెనీ చైర్మన్ ఆర్ వీరమణి ఈ సందర్భంగా సీఎం జగన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్ గుణశేఖర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
కరోనా సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్ లను ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్ లను ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుని కరోనా అదుపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.