టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ రెగ్యులేటరీ హెడ్ జె శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ లు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలు, ముఖ్యంగా డిఫెన్స్ ఏవియేషన్ రంగంలో తయారీ మరియు నిర్వహణపై సీఎం జగన్ తో వారు చర్చించారు.
రాష్ట్రంలో అమలవుతున్న పారదర్శక పారిశ్రామిక విధానాలను వివరించిన ముఖ్యమంత్రి జగన్.. వారి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవాది సుబ్రహ్మణ్యం, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.