AP Politics: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను ముందే చెప్పేశారు. అంటే ఇది పెద్ద ఆశ్చర్యాన్ని ఇచ్చే అంశం ఏమీ కాదు కానీ ఇప్పట్లో ఎన్నికలు లేవు, పొత్తుల ప్రక్రియపై ఆయా రాజకీయ పార్టీలు అధికారికంగా ప్రకటించకముందే ఆ సీనియర్ నేత దానిపై వ్యాఖ్యానించడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబు గానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ, వామపక్షాల నేతలు ఇంత వరకూ అధికారింగా పొత్తు పెట్టుకుంటున్నామని ఇంత వరకూ ఎక్కడా వెల్లడించలేదు.
AP Politics: అవన్నీ ఒక గూటి పక్షులే
అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అన్నట్లు గత కొంత కాలంగా టీడీపీ – జనసేన కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న వార్తలు రాష్ట్రంలో షికారు చేస్తున్నారు. దానికి తగినట్లుగానే వైసీపీ ఆయా పార్టీలను విమర్శిస్తూ ఉంది. రాష్ట్రంలో టీడీపీ ఆడించినట్లు జనసేన, బీజేపీ, సీపిఐ, కాంగ్రెస్ ఆడుతున్నాయని వైసీపీ ఎప్పటి నుండో విమర్శిస్తూనే ఉంది. ఇటీవల తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభలో ఈ పార్టీల నేతలు అందరూ పాల్గొన్నారు. సాధారణంగా జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు కలిసి పని చేస్తాయి, ఇక్కడేమో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీతో కలిసి పని చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం తాము జనసేనతో మాత్రమే కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు సమదూరమని బీజేపి చెబుతోంది.
వైసీపీని ఓడించేందుకు
టీడీపీ మాత్రం రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేన, వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయాలని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల అధికార పార్టీకి లాభం చేకూరుస్తుందనేది వాళ్ల భావన. ఈ తరుణంలోనే కోయిల ముందే కూసినట్లు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు జనసేన, వామపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేస్తుంది అని షరీఫ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో నిన్న నిర్వహించిన టీడీపీ గౌరవ సభ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో..పార్టీ అంతర్గంగా అనుకుంటున్న విషయాన్ని షరీఫ్ ముందే చెప్పేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన, వామపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.