TDP : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వ తేదీ పోలింగ్ నిర్వహించి పదవ తేదీన ఫలితాలు విడుదల చేయాలని షెడ్యూల్ లో పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది..! అధికార పార్టీ అధికారంతో అర్థ, అంగ, కార్యకర్త, క్షేత్ర బలంతో ఇటీవల సాధించిన ఎన్నికల ఫలితాలతో మంచి ఊపు మీద ఉంది.ఈజీగా 80 నుండి 90 శాతం మధ్య స్థానాలను గెలుచుకోవడానికి ఢోకాలేని స్థానంలో ఉంది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉనికి కోసం ఊపిరి పోకుండా పోరాడుతోంది. పంచాయతీ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు లేవు. ఈ పరిస్థితుల్లో మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం అవ్వడం ఆ పార్టీకి సవాలే. అందుకే ఈ సవాల్ ను స్వీకరించాలా? వద్దా? అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి ?అనే దిశగా ఓ సంచలన నిర్ణయం ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
TDP : షాకింగ్ నిర్ణయం దిశగా టీడీపీ అడుగులు..!
రాష్ట ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (వైసీపీ వ్యతిరేకి) ఉన్నప్పుడే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాళ్లు ఎస్ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటువంటి దశలో నీలం సాహ్ని (సీఎం జగన్ కు అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిణి) ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆగమేఖాల మీద అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, వైసీపీ నేతలు మంచి జోష్ గా ప్రకటనలు ఇస్తుండటం చూస్తుంటే ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అనేది తెలుగుదేశం పార్టీ ఊహకు అందుతోంది. తమకు ఆశలు, తమ బలం మీద అశాజకమైన ఫలితాలు వస్తాయని అనుకున్నప్పుడు వాళ్లకు రాలేదు. ఇప్పుడు ఆశలు లేకుండా బలం లేకుండా కనీసం కార్యకర్తలలో నైతిక స్థైర్యం లేకుండా పరిషత్ ఎన్నికలకు వెళితే కశ్చితంగా చావుదెబ్బ తగులుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే ఎన్నికలను ఆపేసేలా కోర్టులో పోరాడాలని, సుప్రీం కోర్టులో వెంటనే పిటిషన్ వేసి ఈ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అది జరగని పక్షంలో ఎన్నికలు జరిగితే మాత్రం బాయ్ కాట్ చేయాలని, ఎన్నికలను బహిష్కరించాలని, ఏ ఒక్కరూ కూడా పార్టీ తరపున పోటీ చేయకుండా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఇదే మొదటి సారి అవుతుంది, చారిత్రక నిర్ణయంగా మిగిలిపోతుంది.
TDP : కీలక నేతల వద్ద అభిప్రాయ సేకరణ షురూ..
ఎన్నికల బహిష్కరణ అంటే ఆషామాషి నిర్ణయం కాదు. జనసేన, బీజేపీ లాంటి చిన్న పార్టీలు కాకుండా దశాబ్దాల తరబడి అధికారంలో, ప్రతిపక్షంలో మంచి రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలను బహిష్కరించడం అంటే ఏపి రాజకీయ చరిత్రలోనే పెద్ద విషయంగా మిగిలిపోతుంది. అందుకే ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని పార్టీ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుండి చంద్రబాబు, లోకేష్ తదితరులు పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ చార్జీలు అందరితో ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. దీనిలో ఎక్కువ మంది ఎన్నికలను బాయ్ కాట్ చేయడమే ఉత్తమం అని సూచించినట్లుగా సమాచారం అందుతోంది. పనిలో పనిగా చంద్రబాబు ఆలోచనలు చూస్తే తిరుపతిలో ఎంపి స్థానానికి ఎన్నికలు ఏప్రిల్ 17వ తేదీన జరగబోతున్నాయి.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల్లో 13 మంది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇన్ చార్జీలుగా మండల స్థాయిలో ఇన్ చార్జిలుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఆ పోలింగ్ 17వ తేదీ జరగబోతున్నది. ఇప్పుడు పరిషత్ ఎన్నికల పోలింగ్ 8వ తేదీ అంటే తిరుపతి ఉప ఎన్నికల మీద ఫోకస్ తగ్గించాల్సి వస్తుంది. అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరించి ఈ ఫోకస్ ను తిరుపతి ఉప ఎన్నిక మీద పెడితే కొంత సానుకూల ఫలితాలు రావచ్చేమో అని అశ కూడా తెలుగుదేశం పార్టీలో కలిగింది. ఓ వైపు ఎన్నికలు బహిష్కరించడం ద్వారా ఎంతో కొంత సానుభూతి రావడం, మరో వైపు తిరుపతి ఉప ఎన్నికల మీద మరింత ఫోకస్ పెట్టడం ద్వారా పార్టీలో కొత్త తరహా నిర్ణయాలకు ప్రాముఖ్యత వస్తుందని తిరుపతి ఉప ఎన్నికల్లో లాభిస్తుందని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో బాయ్ కాట్ మంత్రం ఏ మేరకు ఫలిస్తుంది అనేది రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.