TDP: పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ ఏపి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ కి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది. పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని మీడియాకు వెల్లడించారు. కాగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. చట్ట విరుద్ద ఎన్నికలకు టీడీపీ బహిష్కరించడం సరైందని కోర్టు తీర్పుతో రుజువు అయ్యిందని చంద్రబాబు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి ఇది ఒక చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని స్వీకరించి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నుండి ఎన్నికలను ప్రారంభిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల మార్గదర్శకాలను దిక్కరించే విధానాన్ని జగన్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని గానీ రబ్బర్ స్టాంప్ లాగా మారకూడదని వ్యాఖ్యానించారు.
ఈ నెల 1వ తేదీ ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని అదే రోజు సాయంత్రం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలోనే పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహణల ప్రక్రియ పూర్తి అయింది. నాడు కరోనా నేపథ్యంలో వాయిదా పడగా ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతో ఆగిందో అక్కడి నుండి ప్రారంభిస్తూ నూతన ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన, టీడీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.