TDP: వరుస పరాజయాలను మూటగట్టుకున్న తెలుగుదేశం (Telugudesam) పార్టీ.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘోర ఓటమిని చవి చూసింది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పైగా వైసీపీ కైవశం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కటే అదీ కూడా మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి (JC Prabhakar Reddy) కృషితో గెలిచింది. ఇలా పరాజయాలు ఎదురుకావడంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందనీ, పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతోందనీ ఇలా పలు ఆరోపణలు చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ. అయితే పార్టీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయినందున కొన్ని ప్రాంతాల్లో పోటీలో ఉన్న పలువురు అభ్యర్ధులు ప్రచారాన్ని నిర్వహించారు. బలమైన అభ్యర్ధులు పలు ప్రాంతాల్లో సత్తా చాటారు.
TDP: కుప్పంలో పట్టునిలుపుకునేందుకే
ఇక ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఏపిలో నెల్లూరు మున్సిపాలిటీతో పాటు 12 మున్సిపాలిటీలు, వివిధ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 535 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 14 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల నుండి బద్వేల్ ఉప ఎన్నికల వరకూ పోటీకి దూరంగా ఉన్న టీడీపీ..ఈ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఈ ఎన్నికల షెడ్యుల్ లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండటంతో చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారని భావిస్తున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తే కుప్పంలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని భావించిన చంద్రబాబు ప్రస్తుతం జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించారు.
TDP: చైర్మన్ అభ్యర్ధులకే ఖర్చు బాధ్యత ..?
ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి జరిగిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు చురుకయ్యారు. ఇప్పుడు పార్టీ ఇన్ చార్జిలు కూడా యాక్టివ్ అవుతున్నారు. తగ్గువ మున్సిపాలిటీలే కావడంతో పార్టీకి పెద్దగా ఖర్చు ఉండదు. దానికి తోడు ఆయా మున్సిపాలిటీలో వార్డు సభ్యుల ఖర్చుల బాధ్యతలను చైర్మన్ అభ్యర్ధులు భరించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయకుండా పూర్తికా కాడిపడేస్తే పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడం ఇబ్బంది అన్న ఆలోచనతో టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీకి సన్నద్దం అవుతోంది.
ప్రారంభమైన నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ
రాష్ట్రంలోని నెల్లూరు కార్పోరేషన్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా రాజంపేట, కమలాపురం అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపాలిటీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే విధంగా ఏడు కార్పోరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు, 14 జడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరగనుంది.