టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ నందు జరిగే ఈ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానం పంపుతోంది. ఆ క్రమంలో భాగంగా చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకూ ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహాక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
2019 ఎన్నికల తర్వాత ఒక సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వచ్చారు. అప్పట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ల అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించినా కుదరలేదు. 2018లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ధర్మపోరాట దీక్ష పేరుతో ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేశారు. కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలవ్వడంతో మళ్లీ బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేసినా కేంద్ర పెద్దల నుండి సానుకూల సంకేతాలు రాలేదు.
ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దలు అడగకపోయినా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మద్దతు తెలియజేసింది. వివిధ అంశాల విషయంలో రాష్ట్రంలోని వైసీపీని టీడీపీ విమర్శిస్తుంది కానీ కేంద్రంపైనా, కేంద్రంలోని బీజేపీ పైనా పల్లెత్తు మాట అనడం లేదు. ఇప్పడు కేంద్ర ఆహ్వానం మేరకే ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. మోడీ, షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ సారి వీరి అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోడీ. అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది. అదే సమయంలో నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కూడా మర్యాదపూర్వకంగా చంద్రబాబు కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
హైదరాబాద్ లో కాల్పుల కలకలం .. సినీపక్కీలో రియల్టర్ పై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు