TDP: ఆంధ్రప్రదేశ్ లో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓ కీలక నిర్ణయానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత జరిగిన దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అసెంబ్లీలోనూ సంఖ్యాబలం చాలా తక్కువగా ఉండటంతో అధికార వైసీపీ నుండి తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ సమావేశాల నుండి చంద్రబాబు బాయ్ కాట్ చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టడానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
TDP: వైసీపీ సర్కార్కు వాలంటీర్ వ్యవస్థ దన్ను..?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారికంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వాళ్లతో అర్జీలు పెట్టించడం, ఆ పథకాలు అర్హులకు మంజూరు అయ్యేలా చూడటం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతున్నా ఎన్నికల సమయంలో వీరు వైసీపీకి తమ సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవస్థపై గతంలో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు గ్రామాల్లో టీడీపీ బలోపేతం కావాలంటే అటువంటి వ్యవస్థే పార్టీకి ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారుట. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల నుండే యువతీ యువకులను పార్టీ తరపున పని చేయడానికి ఎంపిక చేయాలని యోచన చేస్తున్నారుట.
TDP: టీడీపీ తరపున పార్టీ హోల్ టైమర్స్
పార్టీ ద్వారా వారికి నెలవారీ కొంత గౌరవ వేతనం ఇస్తూ వారి ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం, గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తెలియజేసే విధంగా విధులను అప్పగించనున్నారుట. నియోజకవర్గ ఇన్ చార్జిలతో త్వరలో సమావేశాలను నిర్వహించి ఈ వ్యవస్థ ఏర్పాటునకు సిద్ధం అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉండగా వచ్చే ఏడాది నుండి కార్యకర్తల నుండి వీళ్లను నియమించుకోవాలని భావిస్తున్నారుట. పార్టీ హోల్ టైమర్ లుగా నియమించుకుంటున్న వీళ్లనే ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్ ఏజంట్ లుగా కూడా వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.