TDP: ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 వ తేదీ (సోమవారం) నుండి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు టీడీపీ వెళ్లాలా వద్దా అనే దానిపై సందేహాన్ని తేల్చేశారు. చంద్రబాబు మినహా ఇతర సభ్యులు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించారు. అయితే పొలిట్ బ్యూరో అభిప్రాయానికి భిన్నంగా టీడీఎల్పీ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించడం విశేషం. చంద్రబాబు నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.
TDP: చంద్రబాబు బాటలోనే తాము అంటూ..
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తరువాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. గత సమావేశంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనంటూ శపథం చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బాటలోనే తాము అసెంబ్లీకి వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ, ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిన విషయాలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
TDP: అవమానాలు భరిస్తూ ఎందుకు..
సభకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదనీ, అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారుట. ఇప్పటికే టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సూచించింది. ప్రివిలేజ్ కమిటి సిఫార్సులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం లేదని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయిదు నుండి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. చివరకు అసెంబ్లీకి చంద్రబాబు మినహా ఇతర సభ్యులు హజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది.