టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి ఒక సీఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగలగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తనకు దిగ్భాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందనీ, ఇప్పటికే పదికిపైగా కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చివేత మొదలు.. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు దయ్యబట్టారు. చింతకాయల విజయ్ కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పుబట్టినా పోలీసుల తీరు మారలేదని విమర్శించారు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్టుకు సంబంధించి న్యాయవరంగా పోరాడతామని ఆమెకు చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో పక్క అయ్యన్న పాత్రుడు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. అయ్యన్న అరెస్టు, తదుపరి పార్టీ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.
అయ్యన్న పాత్రుడు అరెస్టును నారా లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర తదితరులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా విమర్శించారు.