TDP: రాజకీయ పార్టీలు ఒక్కో సందర్భంలో తీసుకునే నిర్ణయాలు కొందరికి వ్యతిరేకంగా మరి కొందరికి అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక తదితర విషయాలపై టీడీపీ ఇప్పటి నుండి దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖరారు చేయకూడదు అని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం పార్టీలో సీనియర్ గా ఉన్న పలువురు నాయకులకు ఇబ్బందికరంగా మారుతోంది. ముందుగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇది జీర్ణించుకోలేని అంశం. ఆయన వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నారు. సోమిరెడ్డి మాదిరిగానే కడప జిల్లా కమలాపురంకు చెందిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఈయన కూడా వరసగా నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలైయ్యారు. కాకపోతే సీనియర్ నేతలు కావడంతో పార్టీలో తమ హవా కొనసాగించుకుంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులు ముందుకు వస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP: లోకేష్ను కలిసిన వీర శివారెడ్డి
ఇటీవల ఒంగోలులో జరిగిన మాహానాడు సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని లోకేష్ చెప్పేశారు. ఈ ప్రకటన కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు అవకాశంగా మారింది. పార్టీలో చేరితే టికెట్ దాదాపు ఖరారు అయినట్లే. ఇంకెందు ఆలస్యం అనుకున్నాడో ఏమో వెంటనే హైదరాబాద్ లో నారా లోకేష్ ను కలిసి ఓ శాలువా కప్పేసి పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశారు. ఇంతకూ ఆ నాయకుడు ఎవరంటే.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వీర శివారెడ్డి. శివారెడ్డి 1994, 2004 లో టీడీపీ తరపున, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. టికెట్ పై హామీ లభిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమైయ్యారు వీర శివారెడ్డి.
TDP: ఎన్నికలకు రెండేళ్ల ముందుగా..
వాస్తవానికి ఈ నియోజకవర్గంలో వీర శివారెడ్డి, టీడీపీ నేత పుత్తా నర్శింహరెడ్డి ఇద్దరూ బలమైన నేతలే. నర్శింహరెడ్డి మూడు పర్యాయాలు 5- 10వేల ఓట్లు తేడాతోనే ఓటమి పాలైయ్యారు. ఒక పర్యాయం 2019 ఎన్నికల్లో మాత్రం 27వేలకు పైగా ఓట్ల తేడాతో వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ మీద ఓడిపోయారు. రవీంద్రనాథ్ రెడ్డికి మద్దుతగా వీర శివారెడ్డి కూడా పని చేశారు. అయితే వీర శివారెడ్డి వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నందున వీర శివారెడ్డికి వైసీపీ తరుపున టికెట్ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వీర శివారెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరితే టికెట్ ఆశించి చేరారు అన్న భావన ఉంటుంది. ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీలో చేరితే పని తీరు ఆధారంగా పార్టీయే టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంటున్న భావనతో ముందుగానే వీర శివారెడ్డి ఓ అడుగు ముందుకు వేశారు. టికెట్ ఆశించి పార్టీ చేరడం లేదని చెబుతున్నా.. చేరిక ఉద్దేశం అదేనని అంటున్నారు. మరో పక్క పుత్తా నర్శింహరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల కడప జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతంలో నర్శింహరెడ్డి కీలక భూమికను పోషించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP: ప్రత్యర్ధుల మధ్య సయోధ్య సాధ్యమేనా..?
నాలుగు సార్లు ఓటమి పాలైయ్యారన్న కారణంతో సీనియర్ నేత నర్శింహరెడ్డిని పక్కన పెట్టి వీర శివారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇస్తారా..? గతంలో ప్రత్యర్ధులైన వీర శివారెడ్డి, నరసింహారెడ్డిలు విభేదాలు మరిచి పార్టీ కోసం కలిసి పని చేస్తారా..? చంద్రబాబు ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య ఎలా కుదురుస్తారు..? అనేది కీలకంగా మారుతోంది. ఎందుకంటే.. వీర శివారెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో పుత్తా నర్శింహరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పుత్తా నర్శింహరెడ్డిపై టీడీపీ అభ్యర్ధిగా వీర శివారెడ్డి 11,288 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన 2009 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పార్టీలు మారారు. వీరశివారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా, పుత్తా నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ వీర శివారెడ్డి 4వేల ఓట్ల ఆధిక్యతతో నరసింహారెడ్డిపై విజయం సాధించారు. వీర శివారెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీకి వెళ్లిన నాయకుడు కాగా, పుత్తా నరసింహారెడ్డి కాంగ్రెస్ నుండి 2009లో టీడీపీలో చేరి కొనసాగుతున్న నాయకుడు. ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా..? లేదా అనేది చూడాలి మరి.