ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ కి వాహనాలు నిలుపుదల చేసి అడ్డంకులు సృష్టించడంతో బలభద్రపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై లారీలు, బస్సులు, వ్యాన్ లు నిలిపివేయడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న వాహనాలు తీస్తారా లేదా అంటూ పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. వాహనాలు అక్కడి నుండి తొలగించకపోవడంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రభుత్వం, పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకే దూసుకెళ్తాం, ఎంత మందిపే కేసులు పెడతారో చూస్తామనీ, తమ కార్యకర్తలు ముందుకొస్తే పోలీసు స్టేషన్లే పట్టవని అన్నారు. చంద్రబాబు కాలినడకన అనపర్తికి బయలుదేరారు. ఆయన వెంట భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తొలుత అనపర్తిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం పోలీసులు అనుమతి రద్దు చేశారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని ఆయన కోరారు. అనపర్తిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల ఆంక్షలకు టీడీప నేతలు మండిపడుతున్నారు. బారికేడ్లు తొసుకుని టీడీపీ శ్రేణులు అనపర్తి దేవీ చౌక్ సెంటర్ కు చేరుకోవడంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి.