టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షెడ్యుల్ ప్రకారం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అయితే రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు స్పందించని కారణంగా చంద్రబాబు రోడ్ షో, సభలకు అనుమతులు నిరాకరిస్తూ డీఎస్పీ సుధాకర్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. అనుమతి లేకుండా సభలు నిర్వహిస్తే నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఏం జరగబోతున్నది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు. అయితే రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేాయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోను పట్టించుకోమనీ, యథావిధిగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు సిద్దంగా ఉండగా, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కుప్పంలో పర్యటన కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల కందుకూరు, గుంటూరు లో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం .. రహదారులపై ర్యాలీలు, సభలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.
పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు