ఏపిలోని ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం బిల్లు సిద్దం చేసింది. యూనివర్శిటీ పేరును డాక్టర్ వైెఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ నేడు మంత్రి విడతల రజిని సవరణ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసారు.
వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదని పేర్కొన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు చంద్రబాబు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా? అని ప్రశ్నించారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందని అన్నారు. దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే జగన్ కు పేరు రాదు సరికదా…ప్రజలు జగన్ దిగజారుడుతనాన్ని ఛీకొడతారని అన్నారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించాలని సూచించారు. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.