టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. రిమాండ్ లో ఉన్న బీసీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని అన్నారు. పోలీసులు తనను పర్యటించవద్దు అని అనడానికి గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అని ప్రశ్నించారు. చేసిన సిగ్గుమాలిన పనిపై పోలీసులు కుటుంబ సభ్యుల వద్ద అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలనీ, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గన్నవరం పార్టీ ఇన్ చార్జి అర్జునుడు చావుబతుకుల మధ్య ఉంటే ఈ తరహా దాడి చర్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారనీ, బరితెగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. జగన్మోహనరెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు పోయారనీ, తప్పు చేసి పోలీసులు అదే బాట పట్టవద్దని చంద్రబాబు హితవు పలికారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గన్నవరంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. టీడీపీ, వైసీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నా ఇంటి వద్ద నుండి చంద్రబాబు పార్టీ కార్యాలయం వరకూ కాలినడకన వెళ్లారు. పార్టీ కార్యాలయం వద్ద ధ్వంసమైన ఫర్నీచర్, కార్లను పరిశీలించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..