Bonda Uma: ఏపిలో జిల్లాల పునర్విభజన కాక కొనసాగుతూనే ఉంది. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల విభజన, డివిజన్ల ఏర్పాటు జరగలేదని పలు ప్రాంతాల నుండి నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్ష నేతలతో కలిసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై అధికార పార్టీ నేతలకు ప్రజల నుండి వత్తిడి వస్తున్నా అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా కృష్ణాజిల్లాలోనూ నేతల పేర్ల అంశంపై డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మచిలీపట్నం (తూర్పు కృష్ణా)కు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి, విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ వస్తుంది.
Bonda Uma: విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి
ఈ డిమాండ్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రేపు విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. అందుక అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రజల మనోభావాలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడివాడ కేసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారనీ, దీని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తీసుకువచ్చారన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే జిల్లాలకు పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, తూర్పు కృష్ణా కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని బొండా ఉమా డిమాండ్ చేశారు
రాధాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ఇదే క్రమంలో వంగవీటి రాధాపైనా బోండా ఉమా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు విషయంపై రాధా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తనకు తెలియదన్నారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారనీ, నాని, వంశీలు ఉద్యమం చేయాల్సిన పని లేదనీ, వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలన్నారు. రాధా ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నారేమో తను చెప్పలేనన్నారు తాను రేపు చేపట్టే దీక్షకు కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ తరలిరావాలని బొండా ఉమా కోరారు. రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలని బొండా ఉమా పిలుపునిచ్చారు.