కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా నేతలు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నగర నడి బొడ్డున వైసీపీ జిల్లా కార్యాలయానికి కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో రెండు రోజుల క్రితం వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల చర్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. భారీగా మోహరించిన పోలీసులు కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రవీంద్రను పోలీస్ వాహనంలో పెడన, బంటుమిల్లి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్కడ నుండి చివరిగా గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గూడూరు స్టేషన్ లో ఉన్న రవీంద్రను మాజీ మంత్రి దేవినేని ఉమ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పెడన నియోజకవర్గ ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పరామర్శించారు. అక్రమ అరెస్ట్ లను వారు తీవ్రంగా ఖండించారు.
మధ్యాహ్నం నుండి రాత్రి పొద్దుపోయే వరకు రవీంద్రను గూడూరు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై పలు సెక్షన్ల కింద రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రవీంద్రకు వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు తరలించారు. అయితే మెజిస్ట్రేట్.. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.