AP muncipal elections: ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయ్. ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా అధికార పార్టీ ఏది ఎక్కువ హవా వుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఫలితాలను చూస్తే కనీస పోటీని తెలుగు దేశం పార్టీ ఇవ్వలేక పోయింది. ఇది ఖచ్చితంగా ఇప్పటికే పీకల్లోతు ఉన్న తెలుగుదేశం పార్టీకి మరింత దారుణమైన విషయమే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి నియోజకవర్గాల్లోనూ, బడా నేతలు ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి పూర్తిగా చతికిలా పడటం చూస్తుంటే ఈ ఫలితాల నుంచి టీడీపీ ఎంతో నేర్చుకోవాలని ఒక సందేశం వచ్చినట్లు అనుకోవచ్చు.
** ఆంధ్రప్రదేశ్లోని 75 మున్సిపాలిటీలో టిడిపి గెలుచుకుంది ఒకే ఒక్కటి. అది కూడా నమ్మకం లేని చోట గెలుచుకుంది. తాడిపత్రిలో మొదటి నుంచి టిడిపి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకు లేదు. టీడీపీ నేతలు గెలుపు లెక్కలు వేసిన చోట పూర్తిగా పార్టీ డీలా పడింది. అద్దంకి, రేపల్లె, మండపేట, కొవ్వూరు వంటి మున్సిపాలిటీలు కచ్చితంగా టిడిపి ఖాతాలో చేరుతాయని మొదటినుంచి భావించారు. అయితే అక్కడ ఫలితాలు పూర్తిగా టిడిపి నిరశ లోకి నెట్టేశాయి.
** తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీల్లో టిడిపి వెనుకబడింది. యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహించిన తునిలో వైస్సార్సీపీ క్లీన్స్వీప్ చేస్తే, అచ్చం నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోనూ అధికార పార్టీ సత్తా చాటింది.
** టిడిపి ఎంతగానో ఆశలు పెట్టుకున్న అమరావతి ఉద్యమం సెంటిమెంటు, ఇటు విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్న తీరు వల్ల విజయవాడ విశాఖపట్నం లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేసింది. గుంటూరులో సైతం ఖచ్చితంగా పీఠం కైవసం చేసుకుంటామని ధీమాగా ఉంది. ఎన్నికల ఫలితాల్లో ఆ సెంటిమెంట్ ఉద్యమాలు ఏమి పని చేయలేదు అన్నది తెలిసిపోయింది. కేవలం అధికార పార్టీ మాత్రమే ప్రజలు జై కొట్టారు అని అర్థమైంది.
** చంద్రబాబు బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం పెద్దగా ఉండదని దీన్నిబట్టి అర్థం కావడం చాలా పెద్ద విషయం. ఇది టిడిపి మనుగడను కూడా ప్రశ్నిస్తోంది. కె ఏకంగా పార్టీ అధినేత ప్రచారానికి వచ్చిన చోట కూడా టిడిపి పత్తలో లేకపోవడం చూస్తుంటే ఆ పార్టీ కు గడ్డు రోజులు మొదలయ్యాయి అని అర్థమవుతుంది. ఒక వేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పుంజుకున్న అది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత తప్పా, చంద్రబాబు యొక్క సామర్థ్యం కాదు అని చెప్పడానికి ఇప్పటి ఫలితాలను ఉదాహరణగా తీసుకోవచ్చు.
** ముఖ్యంగా టిడిపి కంచుకోటగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ క్రమంగా కనుమరుగవుతోంది అని తెలుస్తోంది. ఎప్పటినుంచో టీడీపీ చేతిలో ఉన్న మండపేట మున్సిపాలిటీ ను సైతం టీడీపీ నిలబెట్టుకోలేకపోయింది. ఎక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఉన్నా ఆయనను ప్రజలు ఆదరించే లేదని అర్థమవుతోంది. టిడిపి స్థానాన్ని మెల్లమెల్లగా జనసేన భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గోదావరి జిల్లాల ఫలితాలు చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మెల్లగా కనుమరుగు కావడం చూస్తుంటే, అది పార్టీ పెవిలియన్ కు సంకేతం గా భావించాలి.
** నగరపాలక సంస్థలో టిడిపి పెద్దగా ప్రభావం చూపింది లేదు. చాలా మంచి మెజారిటీతో అధికార పార్టీ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు నగర ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది అని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఈ ఫలితాల తర్వాత మాట మార్చుకోక తప్పదు. ఫలితాలు వెలువడిన 11 కార్పొరేషన్ లోనూ అధికార పార్టీ కైవసం చేసుకోవడం విశేషం.
** ఈ ఫలితాల వల్ల పెద్దగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. జనసేన బీజేపీ పార్టీల ఓటు బ్యాంకు చాలా తక్కువ. అందులోనూ ఇప్పుడిప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో కీలక అవుతున్న సమయంలో ఆ పార్టీలు పెద్దగా పోగొట్టుకున్నది ఏమీ ఉండదు. అయితే టిడిపి తన చరిత్ర గతి మార్చుకుని, తిరోగమనం దిశగా పయనిస్తున్నట్లు మాత్రం ఈ ఫలితాలు ఒక సూచి. ఇటు గ్రామాల్లోనూ అటు పట్టణాల్లో సైతం క్రమక్రమంగా పార్టీని జనాలు మరిచిపోతున్నారు అన్నది సత్యం.