TDP Janasena: ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీల పొత్తు అంశం చాప కింద నీరులా ఉందని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ మినహా ప్రతి పార్టీ పొత్తులతోనే ముందుకు వెళ్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన జనసేన, టీడీపీ, బీజేపీల పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేదు. అయితే.. 2024 ఎన్నికల్లోపు టీడీపీ-జనసేన కలుస్తాయని.. కలిసే ఎన్నికలకు వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కుప్పంలో చంద్రబాబు చెప్పిన ‘వన్ సైడ్ లవ్ పాలిటిక్స్’ నిదర్శనం. పవన్ కూడా.. ‘పొత్తులపై ఆచితూచి ముందుకెళ్తాం’ అన్నారే కానీ.. టీడీపీతో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పలేదు. అయితే.. టీడీపీ అంతర్గతంగా చేసుకుంటున్న మార్పుల్లో జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోబోతోందని తెలుస్తోంది.
జనసేనకు పట్టున్న ఆ జిల్లాల్లో..
నిజానికి (TDP Janasena) జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు ఉంది. దీనినే తమకు బలంగా మలచుకోవాలని టీడీపీ భావిస్తోంది. గతం నుంచీ కూడా ఈ రెండు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ క్షేత్రస్థాయిలో శ్రద్ధ పెట్టడం లేదు. ఇంచార్జిలను కూడా స్థానికంగా పట్టున్నవారిని నియమించడం లేదు. ఇందుకు ఉదాహరణగా 2019లో పవన్ పోటీ చేసిన భీమవరంలో మంచి పట్టున్న పులపర్తి రామాంజనేయులను కాకుండా రాజ్యసభ ఎంపీ సీతామహాలక్ష్మికి ఇంచార్జి బాధ్యతలు అప్పజెప్పారు. ఆమె గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని ఆమెకు ఇంచార్జిగా నియమించడం ద్వారా భీమవరంను జనసేనకు వదిలినట్టే చెప్పాలి. నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే చెప్పేశారు. ఇంచార్జిని కూడా నియమించలేదు.
2024 ఎన్నికలకు వ్యూహం ఇదేనా..
2019 ఎన్నికల్లో (TDP Janasena) టీడీపీకి 27వేల ఓట్లు వస్తే.. జనసేనకు 47వేల ఓట్లు రావడంతో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించబోతున్నారని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు పోతిన మహేశ్ బలంగా ఉన్నారు. టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె 2019లో ఓడిపోయి.. ప్రస్తుతం అంత యాక్టివ్ గా లేరు. ఇంచార్జిగా ఎంపీ కేశినేని నానిని పరిస్థితులను సమన్వయం చేసేందుకే నియమించారని తెలుస్తోంది. 2024లో ఈ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.