TDP: అనంతపురం జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా చక్రం తిప్పిన జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబం గత ఎన్నికల తరువాత రాజకీయంగా తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. వరుసగా ఆరు పర్యాయాలు (డబుల్ హాట్రిక్) తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి జేసీ దివాకరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రోశయ్య మంత్రి వర్గంలో మినహా మిగిలిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనంతరం ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన జేసి దివాకరరెడ్డి తన సోదరుడు ప్రభాకరరెడ్డితో కలిసి 2014 ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరారు. టీడీపీ తరపున అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి జేసి దివాకరరెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపిగా గెలవగా, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వీరు ఇద్దరు పోటీ చేయకుండా వారి వారసులను రాజకీయ అరంగ్రేటం చేయించారు.
TDP: రాజకీయంగా గడ్డుపరిస్థితులు
తాడిపత్రి నుండి పోటీ చేసిన అస్మిత్ రెడ్డి, పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన జేసి పవన్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ ఓటమి పాలైయ్యారు. అయితే గత టీడీపీ హయాంలో ప్రభాకరరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై తీవ్ర స్థాయిలో దుర్భాషలు ఆడారు. తీవ్ర స్థాయిలో విమర్శలూ చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేసి కుటుంబానికి చెందిన మైనింగ్ క్వారీలు, ట్రావెల్స్ పై కేసులు నమోదు చేయడం, ప్రభాకరరెడ్డి ని పలు కేసుల్లో అరెస్టు చేయడం కూడా జరిగింది. రాజకీయంగా, ఆర్ధికంగా తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదురైనా టీడీపీలోనే కొనసాగుతున్నారు. గతంలో బీజేపీలోకి వీళ్లను ఆహ్వానించినా వెళ్లలేదు. తాడిపత్రిలో తమ హవా కొనసాగడంతో కోసం జేసీ ప్రభాకరరెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ కూడా ఇదే. అయితే జిల్లాలోని పాత టీడీపీ నేతలు పార్టీలో వీరి ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదన్న మాటలు వినబడుతున్నాయి. దీంతో జేసీ సోదరులు రాజకీయంగా ఒక అడుగు వెనక్కు వేసినట్లు కనబడుతోంది. గతంలో ఉన్న దూకుడుగా ఇప్పుడు వ్యవహరించడం లేదు.
తాడిపత్రి నుండి ప్రభాకరరెడ్డే పోటీ చేయాలి
మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన ఆంక్షలను వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నది టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీలో సంతృప్తికరంగా లేకపోయినా కొనసాగుతున్నారని అంటున్నారు. వారికి బలం ఉన్న నియోజకవర్గాలకు సైతం వెళ్లవద్దని పార్టీ ఆంక్షలు పెట్టిందట. మరో పక్క రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి నుండి జేసి ప్రభాకరరెడ్డినే పోటీకి నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారుట. అస్మిత్ రెడ్డి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సరైన ప్రత్యర్ధి కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారుట. ఇక అనంతపురం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి జేసీ పవన్ కుమార్ ను మరల పోటీకి నిలిపేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. ఇలా చంద్రబాబు వారికి షరతులు పెట్టిన నేపథ్యంలో జేసీ బ్రదర్స్ వాటిని అంగీకరిస్తారా..? లేదా..? పార్టీలోనే కొనసాగుతారా..? లేక వేరే దారి చూసుకుంటారా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.