TDP : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీలోని సీనియర్ ల నుండి సైతం పార్టీలో నూతన ఉత్తేజం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలనే మాట వినబడుతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
తెలుగుదేశం పార్టీలో త్వరలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీని బలోపేతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబు, టీడీపీపై విమర్శలను సంధించారు.
తండ్రీ కొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుండి బయట పడెదెప్పుడు, పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు అంటూ బుచ్చయ్యను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని పార్టీ అధినేతకు సూటిగా చెప్పవచ్చు కాదా అంటూ సూచించారు. నూతన నాయకుడు రావడానికి పార్టీలో ఏమి మిగిలి ఉందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే బాబు సమాధి చేశాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.