టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు సహా మరో ముగ్గురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన ఎంవి విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు దాడి ఘటనలో పలువురు టీడీపీ నేతలకపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసును పురస్కరించుకుని బుధవారం రాత్రి నెల్లిమర్ల పోలీసులు పెద్ద సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కళా వెంకట్రావు నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం ఆయనను చీపురుపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నువ్వాడ రవిశేఖర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరి కొందరు టీడీపీ నేతలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా కళా వెంకట్రావును బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అరెస్టు చేసిన కళా వెంకట్రావును విడుదల చేయాలని లేకుంటే పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
గత నెల 29న రామతీర్థంలోని కోదండ రామాలయంలోని స్వామివారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజెపీ తదితర హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల రెండవ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్థం సందర్శనకు వెళ్లారు. చంద్రబాబు కంటే ముందుగా విజయసాయి రెడ్డి ఆ పార్టీ నేతలతో రామతీర్థం చేరుకున్నారు. అయితే అప్పటికే చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు రామతీర్థం వద్దకు చేరుకుని ఉన్నారు.
అదే విధంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తదితర బీజేపీ నేతలు అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విజయసాయి రెడ్డి వాహనంపై కొందరు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఆ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగింది. నాడు విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా నేడు పోలీసులు కళా వెంకట్రావుతో సహా మరో ముగ్గురుని అరెస్టు చేశారు.