కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద దుండగులు సుబ్బయను నరికి చంపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నేత అయిన సుబ్బయ్య పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. హతుడు సుబ్బయ్య, అధికార పార్టీ శ్రేణులు ఇటీవల అసాంఘీక కార్యక్రమాలపై సోషల్ మీడియాలో రుసగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టపగలు టీడీపీ నేత హత్య జరగడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. రాజకీయ కోణంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైసీపీ హత్యాకాండ సాగిస్తోందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. చేనేత కుటుంబానికి చెందిన టిడీపీ నాయకుడు సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని మీడియా ద్వారా బట్టబయలు చేశారన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. నందం సుబ్బయ్యది ప్రభుత్వ హత్య అని, దీనికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యత వహించాలనీ, హంతకులను కఠినంగా శిక్షించాలనీ, సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలనీ చంద్రబాబు డిమాండ్ చేశారు.