TDP Leader Pattabhi: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలియాస్ పట్టాభి పోలీస్ కస్టడీ పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న అభియోగంపై పోలీసులు ఆయనను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహంతో వైసీపీ అబిమానులు పట్టాభి నివాసంపై దాడి చేశారు. అదే విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడి చేయడం తెలిసిందే. అయితే పట్టాభి అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న కారణంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యారు.
బెయిల్ పై విడుదల తరువాత మాల్దీవులకు పయనం
జైలు నుండి విడుదల అయిన తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు పట్టాభి ఎయిర్ పోర్టులో, విమానంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆయన మళ్లీ అరెస్టు చేస్తారన్న భయంతో మాల్దీవులకు పరారు అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా పట్టాభి వీడియో సందేశం ఇచ్చారు. ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి కారణంగా తన కుమార్తె పసి హృదయం తీవ్రంగా గాయపడిందనీ, తాను కుటుంబం కోసం బయటకు వెళితే అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. త్వరలోనే వచ్చి క్రియాశీలకంగా పాల్గొంటానని తెలిపారు.
TDP Leader Pattabhi: పట్టాభి కస్టడీ పిటిషన్ డిస్మిస్
ఇదిలా ఉండగా బెయిల్ పై విడుదల అయిన పట్టాభిని కష్టడీలోకి తీసుకుని విచారణ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరతూ విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పట్టాభి తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా ప్రభుత్వ న్యాయవాది పోలీసుల తరపున వాదనలు వినిపించారు. పట్టాభి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు గానూ విచారణ చేయాల్సి ఉందని పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై పట్టాభి తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినవి కావని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు..కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో పట్టాభి తీవ్ర ఉపశమనం లభించింది. పోలీసులు కస్టడీలో వేధింపులకు గురి చేస్తారని భయపడే పట్టాభి తొలుత అరెస్టు కాకముందు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన వంటిపై ఎటువంటి గాయాలు లేవంటూ వీడియో చూపించారు. అనంతరం ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?