Amaravathi Farmers Maha padayatra: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం, సంఘీభావం తెలియజేసేందుకు వచ్చే రైతులను అడ్డుకోవడం, లాఠీ చేయడం, టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు ఘాటుగా స్పందిస్తూ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Amaravathi Farmers Maha padayatra: స్పందన చూసి ఓర్వలేక
రైతుల మహా పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని కుయుక్తులు పన్నుతోందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. మహా పాదయాత్ర భావితరాల భవిష్యత్ యాత్ర, అందుకే పోలీసులను అడ్డం పెట్టకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వారికి ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను దిక్కరించడమే అవుతుందన్నారు. జగన్ రెడ్డి చేసిన మోసాలకు వైసీపీకి చెందిన రైతులు బోరుమని విలపిస్తున్నారని గొట్టిపాటి అన్నారు. పోలీసుల చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే పాదయాత్రను పోలీసులు విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మీడియాపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అమరావతిని ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటిస్తే రైతుల ఉద్యమాన్ని ఆపుతారని చెప్పారు. వైసీపీ సర్కార్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాట తప్పినందుకు వైసీపీ నేతలు అందరూ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని అమరావతే రాజధానిగా ప్రకటించి ప్రజల భవిష్యత్తును కాపాడాలని గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.
రైతుల పాదయాత్ర ప్రారంభం నుండి ప్రభుత్వ కుట్రలు
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ రైతుల పాదయాత్రలో పాల్గొనకుండా గృహనిర్బంధం చేశారన్నారు. మహాపాదయాత్ర ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఆది నుండి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. మహా పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు భ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందనతో ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. పాదయాత్రకు రైతులు, మహిళలు, విద్యార్ధులు, యువకులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు. పాదయాత్రను కవర్ చేయడానికి వచ్చిన మీడియాను అడ్డుకోవడం రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. రైతులపై జరిగిన లాఠీ చార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.