TDP: తెలుగుదేశం పార్టీలో గత కొద్ది రోజులుగా కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. మహానాడు ముగిసిన తరువాత టీడీపీలో అంతర్గత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ పార్టీలో ఉన్నత స్థాయి నాయకత్వం నుండి దిగువ స్థాయి వరకూ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అశాభావంతో ఉన్నారు. అయితే ఇది అతివిశ్వాసం అయితే ఆ పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితిలో పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఆ పార్టీ నాయకులను నియోజకవర్గ ఇన్ చార్జిలుగా బాధ్యతలు తీసుకోమని అడిగితే వారు వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది. అమ్మో నియోజకవర్గ ఇన్ చార్జి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. మళ్లీ వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి. సీటు ఇస్తారో లేదో తెలియదు. మళ్లీ 2019 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తే ఓడిపోతాం, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని కేసులు ఎదుర్కొని క్యాడర్ కాపాడుకునే శక్తి మా దగ్గర లేదు అని చాలా మంది వెనుకడుగు వేశారు. 2019 నుండి 2022 మే నెల వరకూ ఇదే పరిస్థితి టీడీపీలో ఉంది. అందుకే చాలా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను ప్రకటించే పరిస్థితి లేదు.
TDP: నియోజకవర్గాల్లో పోటీ వాతావరణం
కానీ ఈ నెల రోజుల నుండి టీడీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. నాకు ఇన్ చార్జి ఇవ్వండి అంటే నాకు ఇన్ చార్జి ఇవ్వండి, నేను పోటీ చేస్తా, నేను 40 పెడతా, 50 ఖర్చు పెడతా అంటూ ముందుకు వస్తున్నారు. కొత్త కొత్త యువ నాయకులు తెరపైకి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే.. టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్న గట్టి నమ్మకం వారిలో కలగడం. ఒక వేళ వైసీపీ అభ్యర్ధి బలమైన క్యాండెట్ అవ్వడం వల్ల తాను ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగవచ్చు అన్న నమ్మకం కలగడంతో పోటీ పెరిగింది. ఇలాంటివి రాష్ట్రంలో 40 నియోజకవర్గాల వరకూ ఉన్నాయి.
కందుకూరులో మళ్లీ తానేనంటున్న పోతుల
ఉదాహరణకు చూసుకున్నట్లయితే .. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పోతుల రామారావు మాజీ ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుండి గెలిచారు. తరువాత టీడీపీలో చేరారు. అయితే ఆయన 2019 ఎన్నికల వరకూ పూర్తి స్థాయిలో టీడీపీ క్యాడర్ ను కలుపుకోలేదు. పూర్తి స్థాయి రాజకీయం చేయలేక కొంత మేర ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు. ఆయన గ్రానైట్ వ్యాపారాలపై ప్రభుత్వం కన్నేసింది. కేసులు పెట్టింది. ఆర్ధిక మూలాలపై దెబ్బపడింది. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన వ్యాపారాలపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల తరువాత 2022 మే వరకూ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కూడా కొందరు సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాను అక్టోబర్, నవంబర్ నుండి యాక్టివ్ అవుతా, తానే పోటీ చేస్తానని చెబుతున్నారుట. ఈ నియోజకవర్గంలో పోతుల రామారావు యాక్టివ్ గా లేకపోవడంతో ఇన్ చార్జిగా నాగేశ్వరరావును పార్టీ ప్రకటించింది. ఆయనకు ఇన్ చార్జి ఇచ్చి మూడు నెలలు అవుతోంది. ఇప్పుడు మళ్లీ పోతుల రామారావు తానే పోటీ చేస్తానని చెప్పడంతో ఆ నియోజకవర్గ టీడీపీలో ఒ కన్ఫ్యూజన్ వచ్చింది.
TDP: సత్తెనపల్లి టీడీపీలో త్రిముఖ పోటీ
ఇదే రకమైన పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉంది. సత్తెనపల్లిలో ముగ్గురు మధ్య టికెట్ పోటీ నెలకొంది. 2019 నుండి 2021 వరకూ ఎవరూ అక్కడ యాక్టివ్ గా లేరు. 2022 నుండి కోడెల శివరామ్, రాయపాటి సాంబశివరావు కుటుంబం నుండి శైలజ లేదా రంగారావు , వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రసుతం ఈ ముగ్గురు యాక్టివ్ గా ఉన్నారు. ఎవరి గ్రూపు వారిదే అన్నట్లుగా టీడీపీలో ఉంది. వీరిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన రెండు గ్రూపులు సహకరించే పరిస్థితి లేదు. అదే విధంగా విజయనగరం జిల్లా నెలిమర్లలోనూ పరిస్థితి ఉంది. నారాయణ స్వామి వారసుడు, మాజీ ఎంపీపీ బంగారయ్య లు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆరు నెలలు, మూడు నెలల ముందు వరకూ టీడీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటే భయపడే పరిస్థితి ఉండగా ఇప్పుడు నేను అంటే నేను అన్నపరిస్థితికి వచ్చింది.