ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శలు, వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పైనా నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుంటారు. ఇటీవల తన నియోజకవర్గంలో పేకాట రాయుళ్లు అరెస్టు అయిన నేపథ్యంలో తన దైన స్టైల్ లోనే నాని సమాధానం చెప్పారు. పేకాట ఆడితే జరిమానా కట్టడమే కదా, అందుకే జరిమానాలు కట్టేసి మళ్లీ వచ్చి ఆడుకుంటారని నాని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రామతీర్థం ఘటనపై టీడీపీ ఆందోళన చేయడాన్ని పురస్కరించుకుని చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మామకు వెన్నుపోటు, చిత్తకార్తె కుక్కలు, కులం, మతం లేదు అంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక బూతుల మంత్రి, ఆయన అంతే అంటూ టీడీపీ శ్రేణులు ఒకటి రెండు సార్లు అనేసి ఆయన వ్యాఖ్యలపై అంతగా రియాక్ట్ కావడం లేదు.
అయితే నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. న్యాయం, చట్టం అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ఆ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయన్నారు. నాని పేరు ప్రస్తావించకుండానే.. నోరు అదుపులో పెట్టుకోవాలి, మాటలు మాట్లాడమే కాదు అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలకృష్ణ సూచించారు. బాలకృష్ణ ఈ రోజు తన నియోజకవర్గం హిందూపురం గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీకోదండ రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై ఒక పక్కటీడీపీ, మరో పక్క బీజెపి- జనసేన, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఈ ఘటన తెలుగుదేశం పార్టీ కుట్రేనంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.