Ganta Srinivasa Rao: తన రాజకీయ జర్నీ విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. ఇంతకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. మూడు రాజధానుల అంశంలో పార్టీ వైఖరికి భిన్నంగా గంటా స్పందించినప్పుడే పార్టీకి దూరం జరుగుతున్నారనే పుకార్లు వచ్చాయి. గంటా వైసీపీలో చేరికపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ లు తీవ్రంగా వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి.
Ganta Srinivasa Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా
రెండు మూడు పర్యాయాలు వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్లు కూడా ప్రచారం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ నాయకత్వం గంటా విషయాన్ని లైట్ గా తీసుకుంది. ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్వీకర్ తమ్మినేని సీతారామ్ మాత్రం గంటా రాజీనామాను ఆమోదించలేదు.
Ganta Srinivasa Rao: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో గంటా లెక్క తప్పింది
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో గంటా.. కాపు సామాజికవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొనడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. పార్టీలు మారడం, నియోజకవర్గాలు మారడం విజయాలు సాధిస్తూ ఉండటం, ప్రభుత్వంలో మంత్రి పదవితో అధికారికంగా చక్రం తిప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఆయన లెక్క జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో తప్పింది. గంటాకు ప్రతిపక్షంలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం ఇదే ప్రదమం కావచ్చు.
Ganta Srinivasa Rao: బాబు అడుగు జాడల్లోనే
ఇప్పుడు వేరే పార్టీ ఆలోచన లేదన్నట్లుగా గంటా వైఖరి స్పష్టం అయ్యింది. ఇటీవల విశాఖలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో తాను చంద్రబాబు అడుగు జాడల్లో తాను గట్టిగా నిలబడి పని చేస్తాను అంటూ తన మీద వస్తున్న పుకార్లకు తెర దించేశారు. దీంతో గంటా 2024 ఎన్నికల్లో టీడీపీ లో మళ్లీ చక్రం తిప్పబోతున్నారు అన్న సంకేతాలను ఇచ్చారు.
Ganta Srinivasa Rao: పొత్తులకు చాలా సమయం ఉంది
ఇదే సందర్భంలో టీడీపీ – జనసేన పొత్తు అంటూ వస్తున్న వస్తున్న వార్తలపైనా ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని పేర్కొన్న గంటా..తమ పార్టీకి అత్యున్నమైన కమిటీ ఉందని, ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఎన్నికలకు వెళతామని చెప్పారు. రాబోయే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందన్న బలమైన నమ్మకం ఉండటం వల్లనే టీడీపీలోనే కొనసాగాలని గంటా డిసైడ్ అయి ఉంటారని అనుకుంటున్నారు.