ఏపి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, పన్నులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించి టీ బ్రేక్ ఇచ్చారు. ట్రీబ్రేక్ అనంతరం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ కు పట్టుబట్టింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం కొనసాగింది. మరో పక్క ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది. సభ ముందుకు సివిల్ సర్వీసెస్ రిపీట్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, ల్యాండ్ ట్రైటిలింగ్ బిల్లు, యూనివర్శిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు.. ఇతరాలు వచ్చాయి.
బిల్లులను సభ ఆమోదించిన తర్వాత ఆర్ధికాభివృద్ధిపై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకుపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెన్షన్ విధించారు. ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు.
రెండో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. కడప స్టీల్ ప్లాంట్ పై మాటల యుద్ధం