కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బిటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో డిసెంబర్ 19న దళిత మహిళ హత్యకు గురైంది. ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. అయితే హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తమకు న్యాయం చేసేందుకు పోలీసులు కృషి చేస్తుండగా తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీ నిర్వహించారంటూ హతురాలి బంధువులు ఆరోపించారు. అంతే కాకుండా హతురాలి తల్లి ఈ విషయంపై డిసెంబర్ 22న పులివెందుల పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసింది. దీంతో బీటెక్ రవితో సహా 21 మంది టీడీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఆదివారం అనూహ్యంగా చెన్నై విమానాశ్రయంలో రవిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే రవి ని 2018 నుండి వారెంట్ పెండింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం.