టీఆర్పీ రేటింగ్ పెంపొందించుకోవడం కోసం చాలా మీడియాలు చూస్తున్నాయి కానీ బాధ్యతగా పని చేయడం లేదని విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుపై గానీ, టీడీపీపై గానీ అసంతృప్తిగా ఉన్నానని మీడియాకు చెప్పానా అంటూ ఓ టీవి ఛానల్ ప్రతినిధిని నిలదీశారు. విజయవాడలో సోమవారం మీడియా ప్రతినిధులు మాట్లాడించిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయా. కబ్జాలు చేశానా, ఉమనైజర్ నా అని ప్రశ్నించారు. నేను చంద్రబాబు వద్ద బొకే తోస్తున్నట్లు వచ్చిన వీడియో ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. లక్షల వ్యూస్ కోసం ఏది పడితే అది మీ పర్సనల్ ఎజెండాతో వార్తలు ఇస్తున్నారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇవి మరీ ఎక్కువ అయ్యాయన్నారు.
మీ అజెండా ఏమిటి.. ? టీడీపీని నష్టం కల్గించాలనా..? తన కు నష్టం కల్గించాలని చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఎంపీగా తాను ఉన్నా లేకపోయినా విజయవాడకు వచ్చే నష్టం లేదన్నారు. ఏ పార్టీకైనా రీప్లేస్ మెంట్ పెద్ద ఇష్యూ కాదన్నారు. నాని లాంటి వాళ్లు టీడీపీలో వంద మంది పుట్టుకువస్తారని అన్నారు. రాష్ట్రం, దేశం ఏన్నో సమస్యలతో ఉంది, వీటిపై మీడియా దృష్టి పెట్టాలన్నారు. మీడియా తన ఫోకస్ చేయొద్దని కోరారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ అంశం ప్రైవేటు వ్యవహారం కాదనీ, మహిళలకు సంబంధించిన విషయమన్నారు.
కాగా సాయంత్రం ఏపి రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హౌమ్ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేశినేని నాని హజరైయ్యారు. చంద్రబాబుతో చాలా సన్నిహితంగానే ఉండి మీడియాలో తనపై వస్తున్న వాటిపై మరో సారి క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఆజాదీ గా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కేశినేని నాని బొకే ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదని, దీంతో చంద్రబాబు షాక్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నాని క్లారిటీ ఇచ్చారు.