MP Kesineni: విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పార్టీ పై తన అసంతృప్తిని మరో సారి వ్యక్తం చేశారు. తన సోదరుడు కేశినేని చిన్నికి పార్టీ ప్రోత్సహిస్తుండటంపై గత కొంత కాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేశినేని నాని తన దైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. ఓ పక్క విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరో పక్క వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వారిని ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కీలక ప్రకటన చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వస్తే వైసీపీలోకి అహ్వానిస్తామని స్పష్టం చేశారు. నాని మంచి మనిషి అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో కేశినేని నాని టీడీపీ ఎంపీ సీటు విషయంలో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన మనసులో మాట బయటపెట్టారు కేశినేని నాని.
ఇటీవల నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్ని ఆయనను అభినందించారు. తాజాగా ఇవేళ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి కార్యక్రమాలకు హజరైయ్యారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారిని ప్రశంసిస్తుండటంతో పాటు పార్టీ పై దిక్కార స్వరం వినిపిస్తుండటం చూస్తుంటే టీడీపీ నుండి దూరం జరుగుతున్నట్లేనని భావిస్తున్నారు. రీసెంట్ గా మహానాడు కార్యక్రమంలోనూ కేశినేని నాని పాల్గొనలేదు. కాగా ఇవేళ మీడియా ముందు వచ్చే ఎన్నికల్లో సీటుపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎంపీ టికెట్ పిట్టల దొరకు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని అన్నారు. ప్రజలు అందరూ కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానన్నారు.
వైసీపీ నుండి ఆహ్వానం వస్తున్న సమయంలో తన మనస్థత్వానికి సరిపోయే పార్టీ ఏదైనా ఓకే అని చెప్పుకొచ్చారు కేశినేని నాని. తనకు పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేది సమస్య కాదని అన్నారు. తాను ఎంపీ అవుతానా లేదా అనే భయం లేదని పేర్కొన్నారు. ఎంపీగా తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని అన్నారు. ఎంపీగా తాను చేసినన్ని పనులు ఏ ఎంపీ చేయలేదని చెప్పుకొచ్చారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు. దీనితో కేశినేని నాని తన వైఖరి ఏమిటో స్పష్టం చేసినట్లు అయ్యింది.
రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఆయన సోదరుడు చిన్నికి ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తన రాజకీయం మొదలు పెట్టేశారు కేశినేని నాని. మరో పక్క ఎంపీ కేశినేని వ్యవహరిస్తున్న తీరుపై నందిగామ, మైలవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్ర్రేణులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తొంది.