TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఈ ఉదయం కోట బొమ్మాలి పోలీసులు అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ బలపర్చిన అభ్యర్థి అప్పన్నపై దాడి చేశారన్న అభియోగంపై అచ్చెన్నాయుడుతో సహా 22మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తొలుత గ్రామంలో వైసీపీ రాజ్యసభ విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్నామని తెలిపిన పోలీసులు ఆ తరువాత కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించిన తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. తరువాత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపిన అనంతరం కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అప్పన్నపై దాడి కేసులో ఇప్పటి వరకూ 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు నేపథ్యంలో నిమ్మాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.