TDP: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అచేతనావస్థలో అంటే చేతగానితనంలో ఉంది అని అనుకోవచ్చు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొడాలి నానిని ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దిగువ స్థాయి కార్యకర్త నుండి పార్టీ అధినేత వరకూ శత్రువుగానే చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా గుడివాడలో నానిపైనా, గన్నవరంలో వల్లభనేని వంశీపైనా టీడీపీ గెలిస్తేనే సార్ధకత అని ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. అయితే ఇటువంటి నియోజకవర్గంలో గెలివాలంటే సరైన ప్రణాళికలు ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఒక కార్యాచరణ ఉండాలి కదా..! అయితే ఇవి ఏమీ టీడీపీలో కనిపించడం లేదు. అభ్యర్ధి ఎంపిక విషయంలోనే ఇంత వరకూ క్లారిటీ రాక రకరకాల పుకార్లు, ఊహాగానాలు, సర్వేలు, రకరకాల సంప్రదింపులు జరుగుతున్నాయి.
TDP: సరైన ప్రణాళికను తయారు చేసుకోవడంలో..
తాజాగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది సర్వే చేస్తొంది. ఇటీవల కాలంలో ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తొంది. కానీ ఎన్ఆర్ఐ ని నిలబెట్టినా అక్కడ టీడీపీకి గెలుపు కష్టమే. ప్రతి ఎన్నికల సమయంలోనూ చేసే తప్పునే టీడీపీ చేస్తొంది. అభ్యర్ధి ఎంపికలో సరైన ప్రణాళికను తయారు చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతోంది. 2004, 2009లో టీడీపీ తరపున కొడాలి నాని పోటీ చేసి గెలిచారు. 2014 లో రావి వెంకటేశ్వరరావు టీడీపీ నుండి పోటీ చేసి నాని మీద ఓడిపోయారు. 2019లో అభ్యర్ధిని మార్చారు. రాబోయే ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ అయినా ఫరవాలేదు, అంగ బలం, అర్ధ బలం ఉంటే అభ్యర్ధిగా ఎంపిక చేయాలని టీడీపీ చూస్తొంది. ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు ఇన్ చార్జిగా ఉండగా, ఆశ్చర్యకరంగా అయిదారు పేర్లు వినబడ్డాయి. శిష్లా లోహిత్ పేరు గత ఏడాది వినిపించింది. టీడీపీలో ఆయనకు ఒ పదవి కూడా ఇచ్చారు. ఆయన బ్రాహ్మణ సామాజికవర్గం కదా, ఈ నియోజకవర్గంలో పోటీకి సరిపోడు, వర్క్ అవుట్ కాదని అనుకుని ఆయన పేరు పక్కన పెట్టేశారు.
TDP: ఎన్ఆర్ఐని పోటీకి దింపినా…?
ఆ తర్వాత నందమూరి కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేస్తారేమో అన్న పుకార్లు వచ్చాయి. మరో సారి వంగవీటి రాధా పోటీ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన గుడివాడ నాయకులతో తరచుగా మీటింగ్ లు పెడుతుండటంతో ఆ ప్రచారం జరిగింది. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు వంగవీటి రాధ సన్నిహిత మిత్రుడు కావడం వల్ల వారిపై పోటీ చేసే అవకాశం లేదు. కొత్తగా ఎన్ఆర్ఐ పేరు వినబడుతోంది. ఈ ఒక్క నియోజకవర్గ విషయంలో అభ్యర్ధి ఎంపిక విషయంలో టీడీపీ ఎందుకు తడబడుతోంది..? ఒక వేళ ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చినా అంత వర్క్ అవుట్ కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం కొడాలి నాని మీద ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ అక్కడ టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు అన్న విషయంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన వారికి అర్ధం అవుతుంది. అక్కడ కొడాలి నానికి గట్టి పోటీ ఇవ్వాలంటే అంగబలం, అర్ధబలంకు తోడు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. అటువంటి నాయకుడిని తయారు చేసుకోవాలి. వలస నాయకులను ప్రోత్సహించే కంటే లోకల్ లో నాయకత్వాన్ని తయారు చేయాలి. ఆ ప్రక్రియ ఇప్పటికే జరిగి ఉండాలి. ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు వరకూ వేచి ఉండకూడదు.
టీడీపీ వ్యూహత్మక తప్పిదాలు
గత ఎన్నికల తర్వాతనే ఆ ప్రక్రియ మొదలు పెట్టి అభ్యర్ధిని ఎంపిక చేసి ఉంటే ఈ పాటికి పార్టీకి మంచి పునాదులు పడేవి. క్యాడర్ లో జోష్ వచ్చేది. ఎన్ఆర్ఐ విషయంలోనూ టీడీపీ అధిష్టానం అంతగా సుముఖంగా లేదని చెబుతున్నారు. ఆర్ధికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ స్థానికంగా పరిచయాలు లేకపోవడం, పోల్ మేనేజ్ మెంట్ తెలియకపోవడం మైనస్ గా భావిస్తున్నారు. రావి వెంకటేశ్వరరావుకే అభ్యర్ధిగా ప్రకటించాలంటే ఆయన డబ్బులు పెట్టలేరు, దూకుడుగా వ్యవహరించలేరని భావిస్తున్నందున స్థానికంగానే ఒ బలమైన నేతను తయారు చేయాల్సి ఉంటుంది. తరచుగా నాయకులను తయారు చేసే పార్టీ తెలుగుదేశం అని చెప్పుకునే చంద్రబాబు.. గుడివాడ, గన్నవరంలో ఎందుకు నాయకుడిని తయారు చేయలేకపోతున్నారు అనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు, ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి.
YSRCP: కొడాలి, అనిల్ యాదవ్ లకు! బాలినేనికి షాక్ ఇచ్చిన జగన్..! 8 మంది మార్పు వెనుక కారణం..!?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?