TDP : తెలుగుదేశం పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. ఒ పక్క మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిలుపుదలకు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. నిన్న హైకోర్టు తీర్పు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం విజయమని, వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పేశారు. 24 గంటలు గడవక ముందే టీడీపీ ఆశలు అడియాసలైయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజే గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ టీడీపీకై గుడ్ బై వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో మంతెన అనంతవర్మతో పాటు ఆయన మద్దతుదారులు వైసీపీలో చేరి కండువాలు కప్పుకున్నారు.
ఇక తెలంగాణలో ఉన్న ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా ఈ రోజే అధికార టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా పోయారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గతంలోనే టీఆర్ఎస్ గూటికి చేరిపోగా నేడు మెచ్చా నాగేశ్వరరావు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ అందజేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే టీఆర్ఎల్ ఎల్పీలో విలీనం చేసినట్లు బులిటెన్ విడుదల అయ్యింది.
ఒక పక్క కోర్టు తీర్పు, మరో పక్క మాజీ ఎమ్మెల్యే పార్టీ జంప్, అటు తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యే గుడ్ బై ఇలా మూడు పరిణామాలు ఒకే రోజు చోటుచేసుకోవడం విశేషం. ఒక పక్క ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ మరో పక్క ఎన్నికలు నిలుపుదల చేయాలని కోర్టును ఆశ్రయించడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.