TDP: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో అనూహ్య మార్పులకు తెరలేపారు చంద్రబాబు నాయుడు. పార్టీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గానూ చంద్రబాబు ఏడాది క్రితమే కొత్త ప్రయోగం చేపట్టారు. అంతకు ముందు లేని విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుల విధానంను తొలగించి పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులను నియాకమం చేశారు చంద్రబాబు. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి కాబట్టి పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారు. ఆ క్రమంలో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది నేతలను అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. అయితే తొలి నాళ్లలో అధికార వైసీపీకి భయపడి కొందరు నేతలు యాక్టివ్ గా పని చేయలేదు. ఆ తరువాత పార్టీ దిశానిర్దేశంతో చాలా మంది తమ పరిధిలో పార్టీ బలోపేతానికి యాక్టివ్ గా పని చేస్తూ వస్తున్నారు.
TDP: పార్టీ పరిస్థితులపై రివ్యూలు
గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై రివ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే పార్లమెంట్ అధ్యక్షుల పని తీరుపైనా వాకబు చేస్తున్నారు. చాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అధ్యక్షులు బాగానే పని చేస్తున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. తమతమ స్థానాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారుట. కొందరు మాత్రం అంత యాక్టివ్ గా పని చేయడం లేదని సమాచారం. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహ యాదవ్ లు అంత చురుగ్గా పని చేయడం లేదని పార్టీకి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు చెబుతున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు చురుగ్గా పని చేస్తేనే వారి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వైసీపీ చాలా యాక్టివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందుగా వీరితో మాట్లాడి పని తీరు మెరుగుపర్చుకోవాలనీ సూచించనున్నారనీ, అప్పటికీ వారిలో మార్పు కనబడకపోతే ఆ ఇద్దరు నేతలను పక్కను పెట్టి యాక్టివ్ గా పని చేసే నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.